'ఇంకెన్నాళ్లు నన్ను రహస్యంగా ఉంచుతావ్ నాన్న.. నీ కొడుకుగా పరిచయం చేయు'

by Disha Web Desk 2 |
ఇంకెన్నాళ్లు నన్ను రహస్యంగా ఉంచుతావ్ నాన్న.. నీ కొడుకుగా పరిచయం చేయు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంట్రాక్టర్‌గా దేశ, విదేశాల్లో పనిచేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి అనంతరం రాజకీయాల్లోనూ రాణించారు. ఢిల్లీలో చక్రం తిప్పుతుంటే ఊరులో తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి చక్రం తిప్పేవారు. అనంతరం ఆయన ఎంపీగా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డిని రాజకీయాల్లోకి పరిచయం చేశారు. గౌతమ్ రెడ్డి ఏకంగా మంత్రిగా పనిచేశారు. ఇలా రాజకీయంగా కుటుంబం దూసుకెళ్లిపోతుంది. అయితే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారం కుటుంబంలో చిచ్చు పెట్టింది. చంద్రశేఖర్ రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారని ఆమె ఉదయగిరిలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తోందని ఆ విషయం ఇంటా బయట ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం కుటుంబంలో చిచ్చు పెట్టిందని తెలుస్తోంది. ఈ అంశం చంద్రశేఖర్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంపై అటు టీడీపీ సైతం తీవ్ర విమర్శల దాడి చేస్తోంది. ఇంటా బయట తన రెండోపెళ్లిపై షంటింగ్ ఎలా ఎదుర్కోవాలో తెలియక తల పట్టుకుంటున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మరో తలనొప్పి ఎదురైంది. తనకు రాజకీయ వారసుడు ఎవరూ లేరని ఉన్నది ఏకైక కుమార్తె లక్ష్మీ రచనా రెడ్డి మాత్రమేనని ప్రకటించిన కొద్ది రోజులకే నేనెవరుని నాన్నా అంటూ మేకపాటి శివచరణ్ రెడ్డి లేఖ విడుదల చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ లేఖ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

కొడుకు లేకపోతే నేనెవరిని నాన్న: శివచరణ్ రెడ్డి

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబంలో మరో వివాదం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అంటూ శివచరణ్ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ విడుదల చేయడం సంచలనంగా మారింది. తమను 18 ఏళ్లు రహస్యంగా ఉంచి విడిచిపెట్టారంటూ శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖలో ఆరోపించాడు. అంతేకాదు తన తల్లితోపాటు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్న ఫోటోలను సైతం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ లేఖ, అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తనకు కుమారుడు లేరని ఉన్నది ఏకైక కుమార్తె మాత్రమేనని చంద్రశేఖర్ రెడ్డి చేసిన ప్రకటనపై శివచరణ్ రెడ్డి తన లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశాడు. మరి నేను ఎవ్వరిని అంటూ లేఖలో నిలదీశాడు. చదువుకి ఫీజులు చెల్లించడంతో బాధ్యత తీరుతుందా? నాన్న అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అంతేకాదు తన తల్లి తర్వాత పరిచయమైన మహిళను సమాజానికి‌ పరిచయం చేసి తమకు అన్యాయం చేశారంటూ లేఖలో తన ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడిగా తనను అంగీకరించాలని శివచరణ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఈ బహిరంగ లేఖ, ఫోటోలపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎలా స్పందిస్తారో అనేది వేచి చూడాల్సి ఉంది.

గతంలోనే వారసురాలిగా కుమార్తె లక్ష్మీ రచనారెడ్డి పేరు ప్రకటన

ఇదిలా ఉంటే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఏకైక కుమార్తె లక్ష్మీ రచనా రెడ్డి. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఇక లక్ష్మీరచనారెడ్డి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి కోడలు. ఆదాల ప్రభాకర్ రెడ్డి సోదరుడి కుమారుడు వంశీధర్ రెడ్డి భార్య ఆదాల లక్ష్మీ రచనా రెడ్డి. ప్రస్తుతం ఈమె ఫ్యాషన్ డిజైనర్‌గా హైదరాబాద్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె అప్పుడప్పుడు నెల్లూరు వచ్చి వెళ్తుంటారు. అంతేకాదు ఆమెకు నెల్లూరు జిల్లా రాజకీయాలపై మంచి పట్టుకూడా ఉంది. 219 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె తండ్రి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మామ ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె 2024 ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేస్తారంటూ ఊహాగానాలు సైతం వినిపించాయి. నెల్లూరు జిల్లాలో మేకపాటి, ఆదాల కుటుంబాలకు మంచి పట్టు ఉండటంతో ఆమె మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా ఆరంగేట్రం చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో శివచరణ్ రెడ్డి తాను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తనయుడిని అంటూ బహిరంగ లేఖ విడుదల చేయడం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఏం తేల్చుతారోనని ఉత్కంఠ

ఇదిలా ఉంటే ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రోజుకో వ్యవహారంతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తన భార్యగా శాంతి కుమారి అనే మహిళను అందరికీ పరిచయం చేస్తూ వస్తున్నారు. అంతేకాదు రాజకీయాల్లో తన వెంట బహిరంగంగా తిప్పుకుంటున్నారు. అనేక బహిరంగ వేదికలపై శాంతికుమారి స్పీచ్‌లు సైతం ఇచ్చేస్తోంది. అంతేకాదు ఒక షాడో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది. తన అనుకూలమైన వాళ్లకు మాత్రమే నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారని రాజకీయం ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం సోదరుడు మేకపాటి రాజమోహన్ రెడ్డికి తెలియడంతో ఆయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డిని దూరం పెట్టారని తెలుస్తోంది. అయితే శాంతికుమారితో బంధంపై చంద్రశేఖర్ రెడ్డి సతీమణి తులశమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో కుటుంబంలో గొడవలు కూడా జరిగాయని తెలుస్తోంది.

అయితే గత కొన్ని రోజులుగా శాంతికుమారిని రాజకీయంగా వెంట తిప్పుతుండటం.. ఇంతలో తానే వారసుడిని అంటూ శివచరణ్ రెడ్డి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే శాంతికుమారి వ్యవహారం అటు కుటుంబంలో గొడవలకు దారితీస్తే... ఇటు రాజకీయంగా ప్రత్యర్థులకు అస్త్రమిచ్చినట్లు అయ్యింది. మరోవైపు మేనల్లుడు బిజివేముల రవీంధ్రనాధ రెడ్డి శాంతికుమారి వ్యవహారశైలిపై లేఖలు విడుదల చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి శివచరణ్ రెడ్డిని వారసుడిగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అంగీకరిస్తారా..? కుటుంబంలో నెలకొన్న వ్యవహారాలను ఇకనైనా సర్దుబాటు చేసుకుంటారా? రాజకీయ వారసురాలిగా కుమార్తె లక్ష్మీ రచనా రెడ్డిని పరిచయం చేస్తారా? లేక శాంతికుమారిని పరిచయం చేస్తారా అన్న ప్రశ్నలు ఇప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.



Next Story

Most Viewed